BRS MLA: ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ రోజు తెల్లావారుజామున కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వాహనాన్ని నడిపిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Also read: CM Revanth: నెలాఖరు నుంచి ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్.. సిద్ధమైన సర్కార్?
గతంలో కూడా బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో కూడా నార్కట్పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పుడు ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతోపాటు ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. ఇక గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇప్పుడు కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఫిబ్రవరిలోనే మృతి చెందడం కుటుంబంలో మరింత విషాదం నింపింది.
ఇటీవలే దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రథమ వర్ధంతి ఫిబ్రవరి 19న నిర్వహించిన క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరై సాయన్నకు నివాళులు అర్పించారు. తండ్రి ప్రథమ వర్ధంతి నిర్వహించి నాలుగు రోజులైనా కాకముందే సాయన్న కుమార్తె లాస్య నందిత దుర్మరణం పాలు కావటం విచారకరం. ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ ఎమ్మెల్యే ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.