ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు
జాతీయ పౌరసేవల దినోత్సవం
జాతీయ పౌరసేవల దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. దేశంలోని ప్రజలందరికీ కావలసిన కనీస అవసరాలు ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్యను అందించే ముఖ్య లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలను జరుపుకుంటారు. 2016లో తొలిసారిగా జాతీయ పౌరసేవల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధాన మంత్రి పేరిట అవార్డులను ఇవ్వనున్నారు.
భాను ప్రకాశ్ పుట్టినరోజు
తెలంగాణకు చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు భానుప్రకాశ్ 1939 నల్లగొండలో జన్మించారు. నటనపై మక్కువతో స్కూల్లో చదువుతున్న రోజుల్లో 11 ఏళ్లకే స్టేజీపై ‘తార్ మార్’ నాటకంలో ప్రతిభ చూపించారు. ‘డాక్టర్ యజ్ఞం’ నాటికకు దర్శకత్వం చేశారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. 1964లో ‘యాచకులు’ నాటికతో భానుప్రకాష్ నటనకతు మంచి గుర్తింపు వచ్చింది. ఈయన నాటక సంస్థను ‘గ్రేట్ ఈస్ట్రన్ సర్కస్ 8 కంపెనీ’ అని పిలిచేవారు. నటుడు నూతన ప్రసాద్ ను కూడా నటనరంగానికి పరిచయమైనది కూడా ఈ నాటక సంస్థ వల్లనే. 1964 లో డాక్టర్ చక్రవర్తి సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి వచ్చారు. ఈయన నటించిన ఆఖరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్.
శకుంతలా దేవి మరణం
ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జోతిష్య శాస్త్రవేత్త శకుంతలా దేవి 2013 బెంగళూరులో మరణించారు. మానవ గణన యంత్రంగా అందురూ పిలుచుకునే ఆమె 1929 నవంబరు 4న బెంగళూరులో జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి కంప్యూటర్ కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. పలు పుస్తకాలను రచించారు. ప్రపంచంలో అతి వేగంగా లెక్కలు చేయటంలో గిన్నిస్ రికార్డును సైతం గెలుచుకున్నారు. మూడేళ్ల వయస్సులోనే తండ్రి పేకాడుతూ గణిత సంఖ్యలను కంఠస్థం చేసేవారు. 5 ఏళ్ల వయస్సులోనే క్యూబ్ మూలాలను లెక్కించారు. శకుంతలదేవి జీవిత కథ ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించారు. విద్యాబాలన్ ఆమె పాత్రలో నటించారు. కోవిడ్ కారణంగా 2020లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
నిగార్ సుల్తానా మరణం
భారతీయ నటి నిగార్ సుల్తానా 2000 మహారాష్ట్రలోని ముంబైలో మరణించారు. 1960లో వచ్చిన చారిత్రక ఇతిహాసమైన మొఘల్ ఎ ఆజం సినిమాలో బహార్ బేగం పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె 1932 జూన్ 21న తెలంగాణ హైదరాబాద్ లో జన్మించారు. ఆగ్, పతంగా, శీష్ మహల్, మీర్జా గాలీబ్, యహూది, దో కలియా సినిమాలతో ఆమెకు బాగా పేరు వచ్చింది. 1938లో తొలిసారిగా ‘హమ్ తుమ్ ఔర్ వో’ అనే సినిమాలో నటించారు.
అంబటి బ్రాహ్మణయ్య మరణం
ఏపీ రాజకీయనేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య 2013లో మరణించారు. ఏపీ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన ఈయన 1940 జనవరి 13న కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెంలో జన్మించారు. 1964లో తొలిసారిగా నంగేగడ్డ పంచాయతీ వార్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. 1970-81 వరకు వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. 1981-86 వరకు అవనిగడ్డ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1985లో టీడీపీలో చేరి జిల్లా పార్టీ కన్వినర్ గా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994-99 వరకు మచిలీపట్నం ఎమ్మెల్యేగా , 1999 నుండి 2004 వరకు బందరు ఎంపీగా గెలిచారు. 2009లో అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో జరిగిన తెనాలి ఎంపీ ఉపఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2004లో బందరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
ముహమ్మద్ ఇక్బాల్ మరణం
ప్రముఖ ఉర్దూ, పారశీ భాష కవి ముహమ్మద్ ఇక్బాల్ 1938 ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ లో మరణించారు. సారే జహాఁసే అచ్ఛా- హిందూసితాఁ హమారా, హమారా గేయ రచయితగా ప్రసిద్ధి చెందిన ఈయన 1877 నవంబర్ 9న ప్రస్తుత పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జన్మించారు. ఈయనకు అల్లామా (మహా పండితుడు) అనే బిరుదు గలదు.
మార్క్ ట్వేయిన్ మరణం
మార్క్ ట్వేయిన్ గా తన కలం పేరుతో ప్రసిద్ధికెక్కిన అమెరికన్ రచయిత, మానవతావాది 1910 లో మరణించారు. ఈయన అసలు పేరు శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్. ఈయన 1835 నవంబర్ 30న అమెరికాలోని ఫ్లోరిడా, మిస్సోరిలో జన్మించారు. విలియం ఫాక్నర్ చే ట్వేయిన్ ‘అమెరికన్ సాహిత్య పిత’ అని కీర్తించబడ్డారు.
మరిన్ని విశేషాలు
- ఫ్రాన్స్ లో మహిళలు ఓటు వేసేందుకు 1944లో అర్హత పొందారు.
- సౌర మండలం బయట కూడా ఇతర గ్రహాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు 1994 లో వెల్లడించారు.
- భారత ప్రధానమంత్రిగా 1997లో ఐ.కె. గుజ్రాల్ నియమితులయ్యారు.
- తెలంగాణ రాష్ట్రానికి చెందిన రచయిత, జర్నలిస్టు. తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ ఛైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు 2022 హైదరాబాద్ లో మరణించారు.
- ఆధునిక తెలుగు నిఘంటుకర్త, మహామహోపాధ్యాయ బిరుదు గల రవ్వా శ్రీహరి 2023 మలక్ పేట హైదరాబాద్ ల మరణించారు.