National Kabaddi Competitions: కామారెడ్డిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కామారెడ్డి అతిథ్యమివ్వనుంది. ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో అండర్–17 బాయ్స్ కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే జట్లు ఈ నెల 6న రిపోర్ట్ చేస్తాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఈ పోటీలను నిర్వహిస్తారు.
Also read: Team India: బిజీబీజీగా టీమిండియా.. 2024 మ్యాచ్ షెడ్యూల్ ఇదే
పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు రానున్నారు. మొత్తం 650 మంది కబడ్డీ ఆటగాళ్లు పాల్గొంటారు. పోటీల నిర్వహణకు పీఈటీలు, పీడీలు, విద్యా శాఖ, యూత్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ఏర్పాట్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆఫీసర్లతో చర్చించారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు, కోచ్ లు, టీమ్ మేనేజర్లకు వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, డెయిరీ కాలేజీలో క్రీడాకారులకు బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో స్థానిక పీఈటీలతో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 7న పోటీలు ప్రారంభమవుతాయి. పొద్దున ప్రారంభ వేడుకలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ముగింపు వేడుకలకు కేంద్ర, రాష్ట్ర మంత్రులను ఆహ్వానించనున్నారు.