AP Elections: వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ గెలిచేందుకు కృషి చేస్తా!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. వీరితోపాటు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరారు. కాగా, వాస్తవానికి ఈ నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో చివరిలో రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ: పిఠాపురం చుట్టూ రాజకీయం.. పవన్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ!
జగన్ గెలుపు కోసం కృషి చేస్తా..
వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ పద్మనాభం అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని, జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు. అయితే ఈయన గత కొద్దీ రోజులుగా ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఆంధ్ర రాజకీయాలలో తీవ్రంగా నడిచింది. కాకపోతే.. సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని నిర్ధారించుకున్న ఆయన చివరకు వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ALSO READ: ఎన్నికలకు సిద్ధమైన ఈసీ.. రేపు మధ్యాహ్నం షెడ్యూల్!
రాజకీయ ప్రస్థానం ఇదే..
1978లో జనతా పార్టీతో ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత అందులో ముద్రగడ చేరారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఈయన గెలుపొందారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్ సభ స్థానంలో గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పని చేశారు. గతేడాది కాపు ఉద్యమ నేతగా చేపట్టిన పోరాటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా, వైసీపీలోకి రావడంతో రాజకీయాల్లో వేడి మొదలైంది. కాగా, కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం జగన్ ముద్రగడ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
2 Comments