Karnataka: బీజేపీలో చేరిన గాలి.. కమలంలో పార్టీ విలీనం
లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అంతేకాదు పార్టీని కూడా బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప.. గాలి జనార్ధన్ రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also read: TS- TET: టెట్ అభ్యర్థులకు శుభవార్త.. ఇక నుంచి 8 భాషాల్లో ప్రశ్నాపత్రం
కేఆర్పీపీని బీజేపీలో విలీనం చేసినట్టు గాలి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పుకొచ్చారు. ఎలాంటి షరతులు, ఎలాంటి పదవులు అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం మాజీ సీఎం యడియూరప్ప మాట్లాడుతూ.. గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య బీజేపీలో జాయిన్ అయ్యారని.. ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనార్ధన్ రెడ్డి చేరిక బీజేపీని మరింత బలపరుస్తుందని.. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమిని చవిచూసింది. బంపర్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో ఒంటరి పోరు సరికాదని బీజేపీ అనుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోగా.. ఇప్పుడు కల్యాణ కర్ణాటక ప్రాంతంపై పట్టు కలిగిన గాలి జనార్ధన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకుంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తమ వైపు తిప్పుకునేలా కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది.
graison urtaza