RBI: రూ. 2,000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
రూ. 2,000 నోట్లపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69 శాతం నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు స్పష్టంచేసింది. రద్దు చేసిన వాటిలో కేవలం రూ.8,202 కోట్లు విలువచేసే రూ.2 వేల నోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రకటన వెలువడక ముందు రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చెలామణిలో ఉండేవని తెలిపింది. గత నెల 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఇంకా రూ.8,202 కోట్ల విలువైన నోట్లు తిరిగి రాలేదని చెప్పింది.
ALSO READ: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్.. వైఎస్ షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారంటే?
గతేడాది మే 19న రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అనంతరం ఆర్బీఐ కార్యాలయాలైన అహ్మదాబాద్, బెంగుళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబయి, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో నోట్లను డిపాజిట్ చేసేందుకు వీలు కల్పించింది.