BRS: బీఆర్ఎస్కు వరుస షాక్లు.. కారు దిగనున్న కీలక నేతలు!
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు వరుసగా పార్టీకి గుడ్బై చెబుతుండటం, చివరకు టికెట్ దక్కించుకున్న వారు సైతం వేరే పార్టీలోకి వెళుతుండటం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేత, రాములు నాయక్, దానం నాగేందర్ వంటి నేతలు కారు దిగి, హస్తం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లాల్లో ఆ పార్టీ కీలక నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే నిన్న హుటాహుటిన వీరిద్దరూ ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పెద్దల సమక్షంలో వీరు ఇవాళ ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
ALSO READ: పరిశ్రమలతోనే యువతకు ఉద్యోగాలు.. కొడంగల్లో సీఎం రేవంత్
అంతేకాదు, నిన్న కేసీఆర్తో భేటీ అయిన బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదే విషయాన్ని ఆయన నిన్న కేసీఆర్ను కలిసి చెప్పినట్లు సమాచారం. అదే బాటలో ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం కారు దిగి హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ను వీడనున్నట్లు వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇంద్రకరణ్ రెడ్డి నిన్న కే కేశవరావుతో భేటీ అయిన నేపథ్యంలో ఆయనతో పాటే ఇంద్రకరణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టమైపోయింది.