President: తమిళిసై రాజీనామా ఆమోదం.. తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేయగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ సీపీ రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు. కోయంబత్తూరు నుండి రెండు సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఝూర్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
Also read: Jagityala: తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు: ప్రధాని మోదీ
కాగా.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నందున, రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.
One Comment