IPL 17: నేటి నుంచి ఐపీఎల్ సందడి షురూ!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-17కు సమయం ఆసన్నమైంది. మండు వేసవిలో క్రికెట్ అభిమానులకు చల్లటి వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు సిద్ధమైపోయారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ సందడి షురూ కానుంది. ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి ప్రముఖులు ఆరంభ వేడుకల్లో పాల్గొంటున్నారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరుగనున్న తొలి పోరుతో ఐపీఎల్-17వ సీజన్కు అట్టహాసంగా తెరలేవనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై.. ఆరోసారి టైటిల్ను ఒడిసి పట్టుకోవాలని చూస్తుంటే..ఈ సారైనా కప్ను కైవసం చేసుకోవాలన్న కసితో ఆర్సీబీ కనిపిస్తోంది.
ALSO READ: చెన్నై ఫ్యాన్స్ కు కీలక అప్డేట్.. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి 21 మ్యాచ్లకు (ఏప్రిల్ 7 వరకు) మాత్రమే షెడ్యూలును విడుదల చేసింది. పూర్తి షెడ్యూలును తర్వాత ప్రకటిస్తారు. మే 26న ఫైనల్ ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం 10 జట్లు పోటీ పడే ఈ టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లు ఉంటాయి. సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో శనివారం కోల్కతా నైట్రైడర్స్ను ఢీకొంటుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసి సార్లు విజేతగా నిలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించింది. దక్కన్ చార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి.