AP Elections: జగన్ మరో యాత్రకు శ్రీకారం.. నేటినుంచే ప్రచారం!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ.. మరోసారి చారిత్రక విజయమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ‘సిద్ధం’ సభలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్.. నేటి నుంచి ఎన్నికల సమరశంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
ALSO READ: అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పేరును ప్రకటించిన వైసీపీ
రోడ్ మ్యాప్ ఇదే!
తొలి రోజు బస్సుయాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత కుమారుని పల్లి, వేంపల్లి, సర్వ రాజుపేట, వీరపునాయునిపల్లి, గంగిరెడ్డి పల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల మీదుగా సాయంత్రం 4:30 గంటలకు పొద్దుటూరు బైపాస్ రోడ్డుకు చేరుకుంటుంది. ఇక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం మళ్లీ బస్సు యాత్ర సున్నపురాళ్లపల్లె, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, చాగలమర్రి మీదుగా, రాంపల్లె క్రాస్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు.
ALSO READ: ఓటమి భయంతోనే కుప్పం పర్యటన..చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదా?
21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర
బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 21 రోజులపాటు కొనసాగనుంది. నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు రోజూ ఉదయం వివిధ వర్గాలతో సీఎం జగన్ మమేకంకానున్నారు. ఇందలుో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరించనున్నారు. అలాగే సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగింస్తారు. ముఖ్యంగా 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరించనున్నారు. అదే విధంగా 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను ప్రజలకు వివరించనున్నారు.
2 Comments