America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అగ్రరాజ్యం అమెరికా మరోసారి తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. గన్ కల్చర్ని నియంత్రించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఎన్ని కఠిన నియమ, నిబంధనలు రూపొందించినా ఫలితం లేకుండానే పోతోంది. దుండగులు తుపాకులతో రెచ్చిపోతూనే ఉన్నారు. అకారణంగా అమాయకుల ప్రాణాలను తీస్తూనే ఉన్నారు. తాజాగా మిస్సోరి స్టేట్లోని కేన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా సాధారణ పౌరులు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
క్షణాల్లో విధ్వంసం
ALSO READ: ఇవాళ వాలంటీర్లకు నగదు పురస్కారాలు
ఫుట్ బాల్ క్రీడలో ఏటా నిర్వహిస్తున్న ‘సూపర్ బౌల్ ఛాంపియన్షిప్’లో కేన్సాస్ సిటీ చీఫ్స్ విజేతగా నిలవడంతో స్పోర్ట్స్ పరేడ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్రీడాకారులతో పాటు వేలాది మంది ప్రజలు వచ్చారు. అయితే కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికి ఉన్నట్టుండి ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు గానీ కొంతమంది దుండగులు ప్రజలపై విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. అందరూ భయంతో పరుగులు తీశారు. కళ్లు మూసి, తెరిచే లోపే తీవ్ర విధ్వంసం సృష్టించారు. అయితే ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.