Sangareddy: న్యూఇయర్ వేడుకల్లో విషాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
కొత్త సంవత్సర వేడుకల్లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read న్యూఇయర్ రోజు మందుబాబుల భరతం పట్టిన పోలీసులు.. ఎన్ని కేసులంటే..?
హైదరాబాద్ కూకట్ పల్లిలోని జేఎన్ టీయూకు చెందిన విద్యార్థులు భరత్ చంద్ర (19), సునీత్ (18), వంశీ (19) స్నేహితులు. వీరు ముగ్గురు అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. తిరిగి తమ గదికి బైక్ పై బయల్దేరారు. పటాన్ చెరుకు చేరుకోగానే వీరు నడుపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అతివేగంగా ఢీకొట్టడంతో బైక్ ముందు భాగం నుజ్జునుజ్జవగా ఆ ముగ్గురు ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన భరత్ చంద్ర, సునీత్ అక్కడికక్కడే మృతి చెందగా.. వంశీ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వంశీని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా కొత్త సంవత్సరం నాడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో చాలా ప్రమాదాలు సంభవించాయి. కొత్త సంవత్సరం ఆనందంలో అతివేగంతో ప్రయాణించడంతోపాటు పొగమంచు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొత్త సంవత్సరం రోజే పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read టిల్లుతో రెచ్చిపోయిన అనుపమ.. హాట్ ఫోజుతో పోస్టర్ విడుదల