2023 ఆసియా గేమ్స్లో భారత ఫుట్బాల్ జట్టు చైనా చేతిలో 5-1 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని టీమిండియా చైనాపై ఒక్క గోల్ మాత్రమే చేసింది. హాంగ్జౌలోని హువాంగ్లాంగ్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మరోవైపు భారత ఫుట్బాల్ జట్టు 2014 నుండి ఆసియా క్రీడల కోసం వేచిచూస్తుండగా.. ఓటమి ఆరంభం లభించింది. భారత్ తరఫున రాహుల్ కేపీ మాత్రమే ఒక్క గోల్ చేయగలిగాడు. 21 ఏళ్ల క్రితం ఆసియా క్రీడల్లో తలపడ్డ జట్టు.. మళ్లీ ఇప్పుడు ఆడుతున్నాయి.
చైనా మొదటి నుంచి భారత్ పై విరుచుకుపడుతోంది. మ్యాచ్ 17వ నిమిషంలో చైనా తొలి గోల్ చేసింది. టియానీ చైనా ఖాతా తెరిచాడు. అయితే చైనా తొలి గోల్కు భారత్ ఆటగాడు రాహుల్ కెపి అద్భుత సమాధానమిచ్చి.. తొలి అర్ధభాగం అదనపు సమయంలో టీమిండియాకు తొలి గోల్ చేసి మ్యాచ్లో 1-1తో డ్రాగా నిలిచాడు. దీంతో ఫస్టాప్ లో భారత్, చైనా 1-1తో సమంగా నిలిచాయి.
ఇక సెకండాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికే.. 51వ నిమిషంలో చైనా రెండో గోల్ చేసింది. చైనా తరఫున డై వీజున్ రెండో గోల్ చేశాడు. ఈ గోల్తో చైనా 2-1 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్లో వెనుకబడినప్పటికీ సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత్ చైనాను అడ్డుకోలేకపోయింది. టావో కియాంగ్లాంగ్ 72వ నిమిషంలో మూడో గోల్ చేసి జట్టుకు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కేవలం మూడు నిమిషాల తర్వాత.. మ్యాచ్ 75వ నిమిషంలో టావో కియాంగ్లాంగ్ తన రెండో గోల్ను చేశాడు. ఫిఫా ర్యాంకింగ్స్లో 80వ ర్యాంక్లో ఉన్న చైనా జట్టు.. 4 గోల్స్ చేసిన తర్వాత కూడా ఆగలేదు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంజూరీ టైమ్లో.. చైనా తరపున హావో ఫాంగ్ జట్టుకు 5వ గోల్ చేసి 99వ FIFA ర్యాంక్లో ఉన్న భారత జట్టుకు 5-1 తేడాతో ఘోర పరాజయాన్ని అందించాడు.