India Vs Australia: భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్.. వేదికలివేనా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ అంటే ఆ మజానే వేరు. రెండు టాప్ జట్లు విజయం కోసం పోరాడే తీరు క్రికెట్ అభిమానులకు పిచ్చ కిక్ ఇస్తుంది. 2024 లో మరోసారి ఈ రెండు జట్లు టెస్టు సిరీస్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్- జనవరిలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ ఐదు మ్యాచ్లు ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023- 25లో భాగంగా ఉంటాయి. ఈ సిరీస్ కు దాదాపుగా వేదికలు ఖరారైపోయాయి.
Also read: ICC: క్రికెట్ లో కొత్త రూల్.. ప్లేయర్లకు కష్టమేనా?
క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వేదికలను ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ లో జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా రెండో టెస్ట్, అడిలైడ్ వేదికగా మూడో టెస్టు డే నైట్ జరుగుతుంది. మెల్బోర్ వేదికగా నాలుగో టెస్టు, చివరిదైన ఐదో టెస్ట్ న్యూయర్ తర్వాత సిడ్నీ వేదికగా జరుగుతాయి. ప్రస్తుతానికి వేదికలు మాత్రమే ఖారారు కాగా.. మరి కొన్ని రోజుల్లో తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా గడ్డపై గతంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 సైకిల్ లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
2 Comments