ఫిబ్రవరి 02: చరిత్రలో ఈరోజు
కె.విశ్వనాథ్ వర్థంతి
కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్. ఈయన 1930, ఫిబ్రవరి 19 న జన్మించి 2023, ఫిబ్రవరి 2 న మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయమవగా ఆ సినిమా నంది బహుమతి గెలుపొందింది. ఈయన సినీ జీవితంలో గొప్ప పేరును తీసుకువచ్చిన చిత్రం ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారం గెలుచుకుంది. కె.విశ్వనాథ్ గారు సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కలకత్తాలోని ఇండియన్ మ్యూజియం (ఇంపీరియల్ మ్యూజియం) స్థాపించబడింది
ఇంపీరియల్ మ్యూజియం 1814 లో కలకత్తాలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోని తొమ్మిదవ పురాతన మ్యూజియం. దీనినే స్వతంత్రం తరవాత ఇండియన్ మ్యూజియంగా పేరుమార్చారు. భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మ్యూజియం కోల్కతా (కలకత్తా)లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్ధ ద్వారా స్థాపించబడింది. భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ మ్యూజియం నిర్మించబడింది. భారతదేశ వారసత్వాన్ని కాపాడేందుకు ఈ మ్యూజియాన్ని నిర్మించడంలో విలియం జాన్స్ కీలక పాత్ర వహించారు.
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) స్థాపించబడింది
సాధారణంగా PTI అని పిలవబడే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1949లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద వార్తా సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ఇంగ్లీషు, హిందీలో వార్తాలను ప్రచురిస్తుంది.
సీఈవో పదవి నుంచి తప్పుకున్న జెఫ్ బెజోస్
టాప్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 2021 ఫిబ్రవరి 21న సంచలన ప్రకటన చేశారు. అమెజాన్ నుంచి తప్పుకోబోతున్నట్లు వెల్లడించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతున్నట్లు ప్రకటించారు. తన వారసుడిగా ఆండీ జెస్సీని కూడా ఈరోజే సీఈవో గా వెల్లడించారు.
కున్వర్ దిగ్విజయ్ సింగ్ జయంతి
భారత హాకీ క్రీడాకారుడు కున్వర్ దిగ్విజయ్ సింగ్ (2 ఫిబ్రవరి 1922 – 27 మార్చి 1978) ఈ రోజున జన్మించారు. ఈయన ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో పుట్టారు. ఈయన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే పాసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. ఈయనను హాకీ దిగ్గజమైన ధ్యాన్ చంద్ తో పోల్చేవారు.
మరికొన్ని విశేషాలు
- 1970లో ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లా అవతరించింది. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
- టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 న 2జి స్పెక్ట్రం కేసులో అరెస్ట్ చేసి తీహారు జైలులో ఉంచారు. 2012 మే 15 న ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది.
- 1990లో దక్షిణాఫ్రికా జాతి వివక్షవ్యతిరేక కార్యకర్త నెల్సన్ మండేలాపై నిషేదాన్ని అధ్యక్షుడు ఎఫ్డబ్యూ డి క్లర్క్ ఎత్తివేశారు.
- 1876 లో నేషనల్ లీగ్ ఆఫ్ ప్రొఫెషనల్ బేస్బాల్ క్లబ్ లు స్థాపించబడ్డాయి.
- 2020లో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్ ను గెలుచుకుని ఆస్ట్రియన్ డొమినిక్ థీమ్ ను(6-4, 4-6, 2-6, 6-3, 6-4) ఓడించాడు.