Madhya Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 20 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. నిన్న అర్ధరాత్రి దిండోరిలోని బద్జార్ ఘాట్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని షాపురా హెల్త్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు.
ALSO READ: రేషన్ కార్డు ఈ-కేవైసీ.. ఇవాళే లాస్ట్ డేట్
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 9 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారని, గాయపడిన వారిలో 9 మంది పురుషులు, 12 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా అమ్హై డియోరి గ్రామ నివాసితులని, ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు షాపురా ప్రాంతానికి వెళ్లారని పోలీసులు వివరించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.