IMD: వాతావరణశాఖ కీలక ప్రకటన.. ఈసారి ముందుగానే రుతుపవనాలు
వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీపి కబురు చెప్పింది. ఈ సారి వర్షాలు సకాలంలో వస్తాయా..? లేదా.? అనే అనుమానాల నేపథ్యంలో ఐఎండీ కీలక విషయాలను వెల్లడించింది. జూన్- ఆగస్టు నాటికి ‘లా నినా’ పరిస్థితులు ఏర్పడితే రుతుపవనాలు గతేడాది కన్నా ముందే వస్తాయని, విస్తారంగా వర్షాలు కురస్తాయని చెప్పింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే విధంగా బలంగా రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. హిందూ మహాసముద్ర డైపోల్(IOD), లానినా పరిస్థితులు ఒకేసారి క్రియాశీలకంగా మారడం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కన్నా ముందే రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏకకాలంలో ఈ వాతావరణ దృగ్విషయాలు జరగడం కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో కూడిన బలమైన రుతుపవనాలు ఏర్పడే అవకాశం ఉంది.
Also read: Thailand: ఆ బీచ్ లో ఫోటోలు దిగొద్దు.. లేకపోతే జైలుకే
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సగటు కంటే చల్లగా ఉండే లానినా పరిస్థితులు, హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో కూడిన ఇండియన్ ఓషియన్ డైపోల్(IOD) అనేది ప్రత్యేకమైన వాతావరణ సంఘటనలు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఈ పరిస్థితులు రుతుపవనాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ నమూనాల ప్రకారం.. హిందూ మహాసముద్రంపై IOD పరిస్థితులు, పసిఫిక్ మహాసముద్రంలో లానినా ఏర్పాటును సూచిస్తుంది.