PV Sindhu: ఒలింపిక్ విజేతకు మోకాలికి గాయం.. ఆటలకు బ్రేక్!
రెండు సార్లు ఒలింపిక్ పతకాల విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గాయపడింది. ఆమె ఎడమ మోకాలుకు స్వల్పంగా గాయం కావడంతో స్కాన్ తీశారు. ఎడమ కాలుకు క్రాక్ వచ్చినట్లు డాక్టర్లు ఆమెను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. గత వారం రెన్నిస్లో జరిగిన ఫ్రెంచ్ సూపర్ ఓపెన్ రెండో రౌండ్లో సింధు గాయంతో తప్పుకున్న విషయం తెలిసిందే. కాగా, థాయిలాండ్కు చెందిన సుపనిదా కటేతాంగ్తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె గాయపడింది. మళ్లీ ట్రైనింగ్ మొదలుకావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు సింధు తెలిపింది. కొన్నాళ్లు ఆటకు బ్రేక్ తీసుకోవడంతో రాబోయే ఒలింపిక్స్ క్రీడలపై మరింత ఫోకస్ పెట్టవచ్చు అని ఆమె తెలిపారు. త్వరలోనే మళ్లీ కోర్టులో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది.
పడిపోయిన ర్యాంక్
ప్రస్తుతం పీవీ సింధు ఆట ఆందోళన కలిగిస్తుంది. గత కొంత కాలంగా ఆమె తన ఫామ్ను కోల్పోయింది. ఆగస్టులో సింధు ర్యాంక్ 17కు పడిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆమె టాప్ టెన్లో చోటు సంపాదించుకుంది. ఆర్కిటిక్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో సెమీస్కు వెళ్లడంతో ఆమె ర్యాంక్ కొంత మెరుగుపడుంది. కాగా, నవంబర్ 7 నుంచి 12 వరకు కొరియా మాస్టర్స్, నవంబర్ 14 నుంచి 19 వరకు జపాన్ మాస్టర్స్, నవంబర్ 21 నుంచి 26 వరకు చైనా మాస్టర్స్, నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు సయ్యిద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీలు జరగనున్నాయి.