మార్చి 22: చరిత్రలో ఈరోజు
ప్రపంచ నీటి దినోత్సవం
ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారు. నీటిని సంరక్షించడం, నీటి ప్రాముఖ్యం గురించి సమాజంలో అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1993లో ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రకటించింది. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. మొదటి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది.
రాబర్ట్ ఆండ్రూస్ మిల్లికాన్ జననం
ఆండ్రూస్ మిల్లికాన్ ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. ఈయన 1868లో జన్మించారు. ప్రాథమిక విద్యుత్ ఛార్జ్ కొలత, ఫోటో ఎలెక్ట్రిక్ ప్రభావంపై చేసిన కృషికి గానూ 1923లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. మిల్లికాన్ 1891లో ఒబెర్లిన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. 1895లో కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందారు. 1909లో మిల్లికన్ ఎలక్ట్రిక్ని నిర్ణయించడానికి అనేక ప్రయోగాలను ప్రారంభించి, చివరికి విజయం సాధించారు.
తాడేపల్లి లక్ష్మీకాంతారావు వర్ధంతి
ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. కాంతారావుగా ప్రసిద్ధి పొందారు. ఈయన 1923 నవంబర్ 16న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఈయన 2009లో మరణించారు.
జెమినీ గణేశన్ మరణం
జెమినీ గణేశన్ ప్రముఖ తమిళ నటుడు. తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించారు. ఈయన మహానటి సావిత్రి భర్త. తమిళనాడులోని పుదుక్కోటైలో 1920, నవంబర్ 17లో జన్మించారు. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్గా వ్యవహరిస్తారు. ఈయన సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్గా పనిచేశారు. అనంతరం సినిమాల్లోకి ప్రవేశించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. 2005లో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
మరికొన్ని విశేషాలు:
1739: నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
1946: బ్రిటిష్ పరిపాలన నుంచి జోర్డాన్కు స్వాతంత్య్రం లభించింది.
1957: భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది. ఈ క్యాలెండర్ 365 రోజులు, 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది. ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది.
1960: ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్లు లేజర్పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
2000: భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్-3 బి ప్రయోగం విజయవంతం.