ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు
జలియన్ వాలాబాగ్ దురంతం
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో జలియన్ వాలాబాగ్ దురుంతం అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. 1919లో బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పది నిమిషాలపాటు జరిగిన కాల్పుల్లో అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.
థామస్ జెఫర్ సన్ పుట్టినరోజు
అమెరికా దేశ మూడవ అధ్యక్షుడు థామస్ జెఫర్ సన్ 1743 వర్జీనియాలో జన్మించారు. అమెరికా దేశ వ్యవస్థాపక పితామహుల్లో వీరు ఒకరు. 1801 నుండి 1809 వరకు మూడో అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు జాన్ ఆడమ్స్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 1797 నుండి 1801 వరకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజాస్వామ్యం, ప్రజా ప్రభుత్వం, మానవ హక్కుల గురించి అమెరికా ప్రజలలో చైతన్యాన్ని కలిగించి అప్పటి వరకు బ్రిటీషు ప్రభుత్వంలో భాగమైవున్న అమెరికాకు స్వాతంత్ర్యం రావడంలో ప్రముఖ పాత్ర వహించారు.
సీమస్ హీనీ పుట్టినరోజు
సుప్రసిద్ధ కవి, నాటక రచయిత సీమస్ హీనీ 1939 ఐర్లాండ్ లోని కౌంట్ డెస్రీ ప్రాంతంలో జన్మించారు. 1960 నుంచి రచనలు ప్రారంభించారు. ఐరిష్ కవుల్లో డబ్ల్యూబీ యీట్స్ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన హీనీకి 1995 లో సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం దక్కింది.
దుద్దిళ్ల శ్రీపాదరావు మరణం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీపాదరావు 1999 మహదేవపూర్ మండలం అన్నారం వద్ద నక్సల్స్ జరిపిన కాల్పుల్లో మరణించారు. ఈయన 1935 మార్చి 2న భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో జన్మించారు. 1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి మంథని ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశం లభించింది. ఆ తర్వాత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసే అవకాశం దక్కింది.
షేక్ చిన మౌలానా మరణం
భారతీయ ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా 1999 తమిళనాడు శ్రీరంగంలో మరణించారు. ఆయన 1924 మే 12న ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో జన్మించారు. నాదస్వర వాద్యంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. 1977లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఫిలింస్ డివిజన్ డా. షేక్ చిన్న మౌలానా పై ఒక చిత్రాన్ని రూపొందించింది.
ధూళిపాళ సీతారామ శాస్త్రి మరణం
తెలుగు నాటక రంగ కళాకారుడు, సినీ నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రీ 2007 గుంటూరులో మరణించారు. ఈయన 1922 సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో జన్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1962లో వచ్చిన భీష్మ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అనేక పౌరణిక చిత్రాల్లో నటించారు.
వాసిరెడ్డి సీతాదేవి మరణం
ప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి 2007లో మరణించారు. ఈమె 1933 డిసెంబర్ 15న గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించారు. 1950 లో మొదటిసారి రచించిన నవల జీవితం అంటే. ఆ తర్వాత తెలుగులో ఈమె దాదాపు 39 పైగా నవలలు, 100 కు పైగా కథలు రచించారు.
మరిన్ని విశేషాలు
రేడియో అన్నయ్యగా ప్రసిద్ధుడు, ఆంధ్ర బాలానంద సంఘం స్థాపకుడు న్యాయపతి రాఘవరావు 1905 ఒడిశాలోని బరంపురంలో జన్మించారు.
భారతీయ రచయిత్రి, తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాష రచయిత్రి బుర్రా కమలాదేవి 1908 విశాఖలో జన్మించారు.
భారతీయ మైక్రోబయాలజిస్ట్ పొందూరి వెంకట రమణారావు 2005 లో మరణించారు. 1944- 1947 మధ్య ఆర్మీ మెడికల్ సర్వీస్ లో పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ అంబులెన్స్ ఆఫీసర్ గా సేవలందించారు.
భారత్ నుంచి అమెరికాకు తొలిసారిగా 1796లో ఏనుగును తీసుకెళ్లారు. అప్పటి వరకు ఏనుగు అంటే అమెరికన్లకు తెలియదు.